జనసేన మద్దతుదారులు గెలిచారనే అక్కసుతో వైసీపీ నాయకుల దాడులు: నాదెండ్ల మనోహర్‌

  • తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
  • ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని పవన్‌ కల్యాణ్‌ సూచన
  • పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపణ
  • ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి  
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన జనసేన మద్దతుదారులపై గ్రామాల్లో వైసీపీ నాయకులు దాడులకు దిగుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. గెలుపును ఓర్వలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని తూర్పు గానుగూడెం గ్రామంలో జనసేన నాయకుడు గల్లా రంగా సహా పలువురు పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారని తెలిపారు.

ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల్ని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని సూచించినట్లు తెలిపారు.

ఈ దాడుల వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని తెలిపినప్పటికీ.. కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకాడుతున్నారని మనోహర్‌ ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ ఘటనపై దృష్టి సారించి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Andhra Pradesh
YSRCP
Janasena
Pawan Kalyan
Nadendla Manohar

More Telugu News